Jagan: విజయవాడ సబ్ జైలుకు చేరుకున్న జగన్ 1 y ago
విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంశీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్ విజయవాడ సబ్ జైలుకు రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, మొండితోక జగన్ మోహన్ రావు, విద్యార్థి విభాగ నాయకుడు పానుగంటి చైతన్య తదితరులు జగన్ వెంట వచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ 140 (1), 308, 351 (3), రెడ్ విత్ 3 (5) కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టు చేస్తున్నట్లు వంశీ భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించారు. ముందుగా భవానీపురం ఆ తరువాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత కోర్టు వంశీకి రిమాండ్ విధించింది. వంశీ అరెస్టు పై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ నేతలు స్పందిస్తూ అరెస్టు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కక్ష సాధింపులకు పాల్పడుతూ అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందిస్తూ వైసీపీ హయాంలోనే అరాచకాలు చేశారన్నారు. అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తోందన్నారు. అధికారం ఉందని విర్రవీగితే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వల్లభనేని వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు.