Terrorist Threat To ICC: పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు..! 1 y ago
పాకిస్థాన్లో జరుగుతున్నా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల నుండి ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చాయి. పాకిస్థాన్లో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ జరుగుతోంది. చివరిసారిగా 1996 వన్డే ప్రపంచకప్నకు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు 2025లో మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది.
ఈ సమయంలో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) సంస్థ విదేశీయులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. మరోవైపు అఫ్గనిస్థాన్కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం జీడీఐ కూడా ISKP దాడులకు సిద్ధమవుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చైనీస్, అరబ్ దేశీయులే వారి లక్ష్యం అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ISKP ఉగ్రవాదులు నగరాలకు దూరంగా ఉండే ఇళ్లను సేఫ్ హౌస్లుగా వాడుకొనేందుకు ప్లాన్ చేశారని.. ముఖ్యంగా కెమెరాల నుండి దూరంగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని కిడ్నప్ చెయ్యటానికి అనుకూల పరిస్థితులు ఏర్పరుచుకుంటున్నారని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. కిడ్నాప్ చేసిన వారిని రాత్రి వేళల్లో ఇలాంటి చోట్లకు మారుస్తూ భద్రతా దళాల కళ్లు గప్పె ప్లాన్ చేస్తారని తెలిపింది.
దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఐసీసీ ట్రోఫీని జరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు పీసీబీ పెద్దఎత్తున భద్రతా చర్యలను చేపట్టింది. లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు 12 వేల మందికి పైగా పోలీసులను నియమించారు. మార్చి 5న లాహోర్లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్కు 8 వేల మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించారు. రావల్పిండిలో మరో 4 వేల మందికి పైగా పోలీసులను మోహరించనున్నారు.