Merugu Nagarjuna: విశ్వ విద్యాలయాలను టీడీపీ కార్యాలయాలుగా మార్చారు..! 1 y ago
AP : విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్ అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు వైసీపీ నేత మేరుగ నాగార్జున. ఈ మార్పులను ప్రపంచంలో ఉన్న వారంతా కొనియాడుతున్నారని, కానీ కూటమి నాయకులు ఈ వ్యవహారంపై అసెంబ్లీలో ఎగతాళి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్య రంగంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పుడైనా మంచి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.
నాడు - నేడు ద్వారా బడులను వైఎస్ జగన్ దేవాలయాలుగా మార్చారని, చదువులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేయాలనే ఆలోచన లోకేష్ ఎప్పుడూ చేయలేదని, కనీసం ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు యూనిఫాం, షూ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
విద్యా వ్యవస్థ కోసం లోకేష్ ఏమి చేశారని, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం సర్వ నాశనం చేశారన్నారు. విశ్వ విద్యాలయాలను పూర్తిగా కలుషితం చేసి, కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించామని, అదే విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
వైసీపీ హయాంలో నియమితులైన వీసీలను కూటమి నాయకులు భయపట్టి రాజీనామా చేయించారన్నారు. వీసీలు రాజీనామా చేసిన తరువాత ఇన్ఛార్జ్లతో నడిపించారని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్స్లర్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. 2014 - 19లో విశ్వ విద్యాలయాలను పూర్తిగా టీడీపీ కార్యాలయాలుగా మార్చి, టీడీపీ నాయకుల జన్మదిన వేడుకలు నిర్వహించి దారుణంగా వ్యవహరించారన్నారు. క్లాస్ రూమ్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టి, విశ్వ విద్యాలయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.