Jagan: రెండు బడ్జెట్లలో చంద్రబాబు చేసిన మోసం స్పష్టం 1 y ago
AP : ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన రెండు బడ్జెట్లలో చంద్రబాబు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అన్నారని.. కానీ అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అన్న విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ పవన్తో కలిసి మ్యానిఫెస్టో రిలీజ్ చేశారని కానీ ఇప్పుడు వాటి గురించి అడిగితే సమాధానం లేదన్నారు.
కూటమి నాయకులు బడ్జెట్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారన్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని మరో అబద్ధం చెప్పారన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేదంతా మోసం, దగా, వంచన అని పేర్కొన్నారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72 వేలు ఎగనామం పెట్టారన్నారు.
వైసీపీ పాలనలో 6 లక్షల 31 వేల 313 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏపీసీఓఎస్ ద్వారా 96 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.